

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. విభిన్న దేశాల వంటకాలు ఒక్కచోట చేరిపోయాయి. విశాఖ వాసులకు వైవిధ్యమైన రుచులను పంచాయి. శాఖాహార, మంసాహార వంటకాలు సరికొత్త అనుభూతులను అందించాయి. బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఏయూ శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల ఫీస్ట్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. . దీనిలో భాగంగా 40 దేశాల నుంచి విద్యార్థులు ఏర్పాటు చేసిన 38 స్టాల్స్లో వారి దేశ ప్రత్యేక వంటకాలను తయారు చేసి అందించారు . అదే విధంగా ఏయూ ఫుడ్ సైన్స్ విభాగం విద్యార్థులు, ఆచార్యుల సహకారంతో మరొక 18 స్టాల్స్ను ఏర్పాటు చేసి భారతీయ స్వదేశీ రుచులను అందించారు . ప్రపంచ రుచులన్నీ ఒక్కచోట కనువిందు చేస్తూ ఆహార ప్రియులకు నోరూరించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ ఎస్.దివాకర్, ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్తో కలసి ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. విదేశీ విద్యార్థులు, భారతీయ విద్యార్థులు తయారు చేసిన వైవిధ్యమైన రుచులను స్వయంగా రుచిచూసి వారిని అభినందించారు. ప్రపంచ రుచులన్నీ ఒకే విశ్వవిద్యాలయంలో వైవిధ్యమైన వేదికగా ఈ కార్యక్రమం నిలచింది. అక్కడ విదేశీ విద్యార్థులు తయారు చేసిన ప్రతీ వంటకం వెనుక ఒక కధ దాగుంది. వైవిధ్యత, ప్రత్యేకత, విశిష్టత, సాంప్రదాయాల కలయికగా ఈ ఆహార పదార్ధాలు నిలచాయి.ముఖ్య అతిధి డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ ఎస్.దివాకర్ ఆహారం ప్రతీ దేశ ప్రత్యేకతను ప్రస్పుటం చేస్తుందన్నారు. ఎంతో ఉత్సాహంగా విదేశీ విద్యార్థులు పాల్గొనడం మంచి పరిణామమన్నారు. ప్రపంచం గ్లోబల్ విలేజ్ అన్న చందంగా ఈ కార్యక్రమం నిలచిందన్నారు. థింక్ గ్లోబల్…యాక్ట్ లోకల్ అన్న విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ఏయూను అభినందించారు.ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ విభిన్న దేశాల సంస్కృతులను, వారి ఆహార రుచులు, అలవాట్లు తెలుసుకోవడానికి మంచివేదికగా ఇది నిలచిందన్నారు.40 దేశాలకు చెందిన విదేశీ విద్యార్థులు, ఏయూ ఫుడ్ సైన్స్ విభాగం విద్యార్థులు తయారు చేసిన ఆహార పదార్ధాలు నగరానికి ఒక ప్రత్యేక వేదికగా నిలచిందన్నారు. వారి సాంప్రదాయ వస్త్రధారణలో వారి సంస్కృతులు తెలియచేయడం మంచి పరిణామమన్నారు. ఈ నెల 26న విదేశీ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవం కూడా నిర్వహిస్తున్నామన్నారు. దేనికదే ప్రత్యేకం… ఇథియోపియా సాంప్రదాయ కాఫీ ఉత్సవం, నాన్వెజ్ వంటకాలు, ఎరిత్రియా దేశ విద్యార్థులు తయారు చేసిన చికెన్,ఎగ్ రెసిపీలు, కొమరూన్ దేశం ప్రత్యేక మైన ఇగుసి సూప్, కాంబోడియా దేశ విద్యార్థుల చేపల వంటకాలు, భూటాన్ విద్యార్థుల శాఖాహార వంటకాలు, ఆగోల విద్యార్థుల ఫుంగి, కాలులు, ఆఫ్గన్ విద్యార్థుల కాబూలి పలావ్, జోర్డాన్ విద్యార్థుల షవర్మ, కెన్యా విద్యార్థుల మెకిమో, మడగాస్కర్ విద్యార్థుల మెకడోని, మారిషస్ విద్యార్థుల ఢోలి పూరి శాఖాహార వంటకాలు, నేపాల్ మెమోలు, నమీబియా, మయమ్మార్,నైజీరియా, పాలస్థీనా,సొమాలియా,సౌత్ఆఫ్రికా,శ్రీలంక,సూడాన్,టాంజానియా,ఉగాండా,వియత్నాం,జాంబియా,జింబాంబ్వే తదితర దేశాల విద్యార్థులు తయారు చేసిన సాప్రదాయ వంటకాలు ఆయా దేశాల వారసత్వాన్ని, సంస్కృతిని, ఆహారపు అలవాట్లను విశాఖ వాసులకు పరిచయం చేసాయి. భారతీయ వంటకాలు…
ఏయూలో ఫుట్ సైన్స్ టెక్నాలజీ కోర్సును అభ్యశిస్తున్న విద్యార్థులు ప్రత్యేకంగా భారతీయ వంటకాలను తయారు చేసి ఫుడ్ ఫెస్టివల్లో ఉంచారు. విద్యార్థులు వారు అభ్యసించే కోర్సులలో భాగంగా నేర్చుకొని తయారుచేసిన బిస్కెట్స్, కేక్లు, పానీయాలు ఆహా అనిపించాయి. భారతీయ వంటకాలను విదేశీయులు ఎంతో ఇష్టంగా తిన్నారు. వివిధ దేశాల రుచులను ఒకే ప్రాంతంలో అందించడంతో ఏయూ విద్యార్థులు, ఆచార్యులు, నగరవాసులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు నచ్చిన వెజ్, నాన్ వెజ్ రుచులను ఆస్వాదిస్తూ ఆహార ప్రియులు సందడి చేసారు. వేదికవద్ద ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలు మంచి జోష్ను నింపాయి. కార్యక్రమాన్ని అంతర్జాతీయ విద్యార్థుల విభాగం డీన్ ఆచార్య ఎస్.పాల్ డగ్లస్, అసోసియేట్ డీన్లు ఆచార్య ఎన్.ఎం యుగంధర్, ఆచార్య విజయశాంతి, ఆచార్య ఎన్.విజయ్ మోహన్లు సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, పాలక మండలి సభ్యులు, ప్రిన్సిపాల్స్, ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యాయామ విద్య సంచాలకులు ఆచార్య ఎన్. విజయ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అంతర్జాతీయ విద్యార్థుల విభాగం డీన్ ఆచార్య ఎస్.పాల్ డగ్లస్, అసోసియేట్ డీన్లు ఆచార్య ఎన్.ఎం యుగంధర్, ఆచార్య విజయశాంతి, ఆచార్య ఎన్.విజయ్ మోహన్లు సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించారు.
