
విశాఖ ఎడ్యుకేషన్, మార్చి 23 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : భారత దేశం అత్యుత్తమ మేధో సంపదకు నిలయమని ఐఐటి ఖర్గపూర్ పూర్వ ఆచార్యులు, ఐఐటి ఖర్గపూర్ సివిల్ ఇంజనీరింగ్ పూర్వ విభాగాధిపతి ఆచార్య ఎం.ఆర్ మాధవ్ అన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ విభాగం, ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ విశాఖ ప్రాంతీయ కేంద్రం సంయుక్తంగా శతాబ్ది ఉత్సవాలలో భాగంగా జియో టెక్నికల్ సొల్యూషన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ప్రోబ్లమేటిక్ గ్రౌండ్ అంశంపై నిర్వహిస్తున్నరెండు రోజుల వర్క్షాప్లో భాగంగా రెండవ రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్ట్మాత్మక ప్రాజెక్టులను నేడు భారత్ చేపడుతూ, సమర్ధవంతంగా నిర్వహిస్తోందన్నారు. మానవ మేధస్సుతో అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయడం వీలవుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన జియో సూత్రాస్- పేరడైం ఫర్ జియోప్రాక్టీస్ అంశంపై ప్రసంగించారు. ప్రొఫెసర్ ఎం.ఆర్. మాధవ్ తన విస్తృత అనుభవం పరిశోధనల ఆధారంగా రూపొందించిన జియోసూత్రాస్ (జియో సూత్రాస్ ) పుస్తకం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకం భూసాంకేతిక ఇంజనీరింగ్ (జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ) ఆచరణలోని కీలక భావనలను వివరిస్తూ, పాటించాల్సిన పాటించకూడని అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. భారత దేశానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన చీనాబ్ నదిపై రైల్వే బ్రిడ్జి ప్రాజెక్టులో సేవలందించిన ఐఐఎస్సి ఆచార్యులు జి.మాధవి లత ఇంజనీరింగ్ ద వరల్డ్స్ హైయ్యస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా అంశంపై ప్రసంగించారు. రెండు దశాబ్ధాల కృషి, లక్షలాది మంది సహకారంతో ఇది సాధ్యపడిందన్నారు. ప్రపంచంలో దీని నిర్మాణంతో మనం మౌళిక వసతుల అభివృద్దిలో నెంబర్ 1 స్థానంలో నిలచామన్నారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించిన సమయం నుంచి నిర్మాణం వరకు జరిగిన సాంకేతక అంశాలు, ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమింస్తూ ముందుకు సాగిన విధానం ఆమె వివరించారు. నేడు ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తయిన తరువాత కశ్మీర్ ప్రాంతంలో పండించే యాపిల్స్, కుంకుమపువ్వు వంటి వ్యవసాయ ఉత్పత్తులు కేవలం కొద్ది గంటల సమయంలోనే దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుతున్నాయన్నారు. ప్రాంతాలను అనుసంధానించడంతో పాటు వ్యవసాయానికి సైతం ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తంగా నిలచిందన్నారు. దాదాపు 127 సంవత్సరాల కల ఈ ప్రాజెక్టుతో సాకారం అయిందన్నారు. సివిల్ ఇంజనీరింగ్ మార్వెల్గా దీనిని చెప్పవచ్చున్నారు. ఈఫిల్ టవర్ కంటె ఎత్తులో దీని నిర్మాణం చేసామని, 266 కిలీమీటర్ల వేగంతో వచ్చే గాలులను సైతం తట్టుకుంటుందని, బ్లాస్ట్ ప్రూఫ్గా, ఎంతో సుందరగా ఈ బ్రిడ్జి నిలుస్తుందన్నారు. 8 మాగ్నిట్యూడ్తో వచ్చే భూకంపాలను సైతం తట్టుకుని నిలచే సామర్ధ్యం ఈ బ్రిడ్జి కలిగి ఉందన్నారు. రెండు కొండలను అనుసంధానిస్తూ నిర్మించిన ఈ భారీ నిర్మాణంలో భాగం కావడం, పర్యావరణ హితంగా నదికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, విభిన్న శాస్త్ర సంబంధ నిపుణుల సహకారం, సమన్వయంతో నిర్మించిన ఒక అద్భుత నిర్మాణంగా నిలుస్తుందన్నారు. ఇటువంటి ప్రాజెక్టులో తాను భాగం కావడం తనకు అమితమైన సంతృప్తిని అందించిందన్నారు. చీనాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం పై ఐఐటి మద్రాసు విశ్రాంత ఆచార్యులు, ఏయూ అడ్జంక్ట్ ప్రొఫెసర్ కె.రాజ గోపాల్ ప్రసంగించారు. ఐఐటి మద్రాసు ఆచార్యలు టి.త్యాగరాజ్ డిసికేటెడ్ స్టేట్ ఫ్రీ స్వెల్ అంశంపై, ఐఐటి తిరుపతి ఆచార్యులు సి.హెచ్ మురళీ కృష్ణ లిక్విఫికేషన్ మిటిగేషన్ విత్ స్టోన్ కోలమ్స్ అంశంపై, ఎస్జెసిఈ మైసూరు సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్య ఎస్.కె ప్రసాద్, యువిసిఈ(బెంగళూరు) యూవీసిఈ సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్య హెచ్.ఎన్ రమేష్ ఫోరన్సిక్ అనాలసిస్ ఆఫ్ రీసెంట్ బిల్డింగ్ కొలాప్సెస్ ఇన్ బెంగళూరు అంశంపై ప్రసంగించారు. సదస్సు కన్వీనర్, ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్య సి.ఎన్.వి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల వర్క్షాప్కు సహకరించిన ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీకి, ప్రత్యేక ప్రసంగాలు అందించిన నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు. వర్తమాన అంశాలపై, విశిష్ట నిర్మాణాలపై విలువైన జ్ఞానాన్ని యువతకు అందించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహద పడిందన్నారు. అనంతరం అతిధులను సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ అద్యక్షులు డాక్టర్ అనీల్ జోషి, గౌరవ కార్యదర్శి డాక్టర్ ఏ.పి సింగ్, సదస్సు సమన్వకర్తలు ఆచార్య పి.వి.వి సత్యనారాయణ, ఆచార్య కె.రాజ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. విభాగ ఆచార్యులు, పరిశోధకులు, దేశ వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ఆచార్యులు, పరిశోధకులు ఈ రెండు రోజుల వర్క్షాప్లో పాల్గొన్నారు. అనంతరం వర్క్షాప్కు హాజరైన వారికి సర్టిఫీకేట్లను ప్రధానం చేశారు
