
Visakhapatnam, November : కొత్తపేట పర్యటన సందర్భంగా, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ అపారమైన చారిత్రిక–ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించారు. ఈ దర్శనం ఎంపీ శ్రీభరత్ కి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించిందని తెలిపారు. ప్రత్యేక దైవంగా పూజించబడే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల కోరికలను తీర్చే వరప్రదాయకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆలయంలోని శిల్పకళా వైభవం, ఆలయ పరిసరాల్లో నెలకొన్న నిశ్శబ్ద పవిత్ర వాతావరణం, గోదావరి తీరం అందించే ఆధ్యాత్మిక స్పూర్తి ఇవి అన్నీ కలసి ఎంపీ శ్రీభరత్ గారిలో మరింత గాఢమైన భక్తి భావాన్ని నింపాయి. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రూ. 1.16 కోట్ల వ్యయంతో నిర్మించనున్న టెన్జెల్ షెడ్డు పనులకు ఎంపీ శ్రీభరత్ శంకుస్థాపన చేశారు. అలాగే అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయడానికి కొత్త 108 అంబులెన్స్ను ఎంపీ శ్రీభరత్ గారు ప్రారంభించారు. ఈ పుణ్యక్షేత్ర కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యానందరావు కూడా ఎంపీ శ్రీభరత్ తో కలిసి పాల్గొన్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఎంపీ శ్రీభరత్ ఆకాంక్షించారు.
