
ఆంధ్రవిశ్వవిద్యాలయం : విశిష్ట పరిశోధనలతోనే విశ్వవిద్యాలయానికి విశిష్ట గుర్తింపు లభిస్తుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ (శ్రీకాకుళం) పూర్వ వైస్ చాన్సలర్ ఆచార్య నిమ్మ వెంకట రావు అన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఏయూ విద్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రీసెర్ఛ్మెథడాలజీ రెండు రోజుల వర్క్షాప్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య నిమ్మ వెంకట రావు మాట్లాడుతూ పరిశోధన విధానంపై సమగ్ర అవగాహన కల్పించే విధంగా వర్క్షాప్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. వర్తమాన అంశాలపై, నవ్య ఆలోచనలతో పరిశోధనలు జరపాలన్నారు. పరిశోధనల ఫలితాలు సమాజ ఉపయుక్తంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ చైర్మన్ ఆచార్య ఎన్.విజయ మోహన్ మాట్లాడుతూ పరిశోధన సమస్య ఎంపిక నుంచి పరిశోధన సిద్ధాంత గ్రంధం తయారీ వరకు విభిన్న దశలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే అర్ధవంతమైన పరిశోధనలు వస్తాయన్నారు. ఇటువంటి ప్రత్యక్ష అవగాహన కల్పించే వర్క్షాప్లను మరిన్ని నిర్వహించాలని సూచించారు. సదస్సు కన్వీనర్, విద్య విభాగాధిపతి ఆచార్య టి.షారోన్ రాజు మాట్లాడుతూ రెండు రోజుల వర్క్ షాప్ లో భాగంగా నేర్చుకున్న అంశాలు నిశితమైన పరిశీలనతో, నైతిక విలువలకు ప్రాధాన్యత కల్పిస్తూ, సామాజిక ప్రాధాన్యత కలిగిన అర్ధవంతమైన పరిశోధనలు జరిపే దిశగా ప్రేరణ కలిగిస్తాయన్నారు. కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య టి.స్వరూప రాణి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిస్సా విద్యవిభాగం ఆచార్యులు డాక్టర్ అశోక్ కుమార్ ఇరిగల, ఆచార్య ఎం.ప్రభాకర రావు, ఆచార్య ఎన్.సాల్మన్ బెన్నీ, దూరవిద్య సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం సదసు్సలో పాల్గొన్న ప్రతినిధులను సర్టిఫికేట్లను ప్రధానం చేశారు.
