
విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 27 : సర్వే ఆఫ్ ఇండియాతో ఆంధ్ర విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం చేసుకుంది. గురువారం పాలకమండలి సమావేశం మండలంలో ఒప్పంద పత్రాలపై ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, సర్వే ఆఫ్ ఇండియా అడిషనల్ సర్వేయర్ జనరల్ జి. వరుణ కుమార్ లు సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పరిశోధన, ఇంటర్న్ షిప్ కల్పనతో పాటు సర్వే ఆఫ్ ఇండియా కు సంబంధించిన సమాచారాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అందించనున్నారు. ఈ అవగాహన ఒప్పందం ఐదు సంవత్సరాల కాలానికి చేసుకున్నారు. జియోమెటిక్స్, జియో ఇన్ఫర్మేషన్, జియో స్పీషియల్ టెక్నాలజీ రంగాలలో పరిశోధన భాగస్వామ్యం దిశగా రెండు సంస్థలు పనిచేస్తాయి. రెండు సంస్థలకు ఉపయోగంగా నిలిచే పరిశోధన అంశాలలో కలసి పనిచేస్తారు. సర్వే ఆఫ్ ఇండియాలో అర్హత కలిగిన సిబ్బందికి ఎం.ఈ, ఎంటెక్, పీహెబ్రీ వంటి కోర్సులను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తిచేసే అవకాశం కల్పిస్తారు. యూజీ, పేజీ విద్యార్థులకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ జియో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ లో ఇంటర్న్ షిప్ అవకాశం కల్పిస్తారు. రెండు సంస్థలు సంయుక్తంగా సదస్సులు, వర్క్ షాప్ లను నిర్వహిస్తాయి. సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులకు వివిధ అంశాలపై ఏయుతో సంయుక్తంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపడతారు. ఈ సందర్భంగా ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ సర్వే ఆఫ్ ఇండియాలో సీనియర్ అధికారులు ఏ. యుకు చెందిన పరిశోధక విద్యార్ధులకు మార్గదర్శకం అందించాలని సూచించారు.
